పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు.. వర్మ వర్సెస్ పెండెం దొరబాబు

  • పిఠాపురంలో మరోసారి భగ్గుమన్న టీడీపీ-జనసేన వర్గపోరు
  • ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలో సీఎం ఫొటో లేకపోవడంపై వివాదం
  • టీడీపీ నేత వర్మ, జనసేన నేత దొరబాబు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట
  • క్రమశిక్షణ తప్పితే సహించేది లేదంటూ వర్మ ఘాటు హెచ్చరిక
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఓ ప్రభుత్వ కార్యక్రమ ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో లేకపోవడం తీవ్ర వివాదానికి, తోపులాటకు దారితీసింది.

మంగళవారం పిఠాపురంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో లేకపోవడాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ గమనించి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సీఎం ఫొటో పెట్టకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘనేనని ఆయన జనసేన నాయకులను, అధికారులను నిలదీశారు.

ఈ క్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మలబాబుతో వర్మకు వాగ్వాదం జరిగింది. ఇంతలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కల్పించుకుని వర్మపైకి దూసుకెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు.

అనంతరం వర్మ మాట్లాడుతూ, దొరబాబు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "జనసేన, టీడీపీ ఒకే కుటుంబం. కానీ, వైసీపీ నుంచి వచ్చిన వారు ఇక్కడ పెత్తనం చెలాయిస్తే ఎలా? క్రమశిక్షణ తప్పితే తోలు తీస్తా" అంటూ ఘాటుగా హెచ్చరించారు. పవన్ కల్యాణ్ గెలుపు కోసం తామంతా కష్టపడితే, గెలిపించిన టీడీపీ నాయకులపైనే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి అవమానం జరిగితే సహించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటన పిఠాపురంలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని మరోసారి బహిర్గతం చేసింది.

Pithapuram
SVSN Varma
Pendem Dorababu
CM Photo
TDP
Janasena

More Telugu News