నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. సమ్మెకు మద్దతు ప్రకటించిన కవిత

TGSRTC strike in Telangana
  • సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న జేఏసీ
  • ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని కోరిన జేఏసీ ఛైర్మన్
  • ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపణ
2026 ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. పలు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న మాట్లాడుతూ, తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం సరికాదని అన్నారు.

ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చి, దానిని ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలయాపన కోసమే విలీన కమిషన్ వేశారని అన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రో రైలును ప్రభుత్వపరం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు.

రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే వేల కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధిని ఎలా చేపడుతున్నారని ప్రశ్నించారు. ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చి ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీని హైదరాబాద్‌లో లేకుండా చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

అలాగే ఆర్టీసీకి చెందిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని హెచ్చరించారు.

ఆర్టీసీ జేఏసీ సమ్మెకు కవిత మద్దతు

ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన సమ్మెకు తాము మద్దతిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆమె కోరారు. 
Go Back to Shorts
tsrtc strike
tsrtc strike latest news today
rtc strike in telangana

More Telugu News