మరో 100 జన్మలెత్తినా అమరావతి పూర్తి కాదు: అంబటి రాంబాబు
- రాష్ట్రానికి శాశ్వత రాజధాని లేకపోవడానికి చంద్రబాబే కారణమన్న అంబటి
- తాత్కాలిక కట్టడాలతో కాలక్షేపం చేశారని విమర్శ
- అవినీతి కోసం అమరావతిని వాడుకుంటున్నారని ఆరోపణ
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని లేకపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని అంబటి రాంబాబు విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరుతో కేవలం అవినీతి, కమీషన్ల కోసమే అమరావతిని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేంద్రం నిధులిచ్చినా శాశ్వత భవనాలు కట్టకుండా, తాత్కాలిక కట్టడాలతో కాలక్షేపం చేశారని మండిపడ్డారు.
"అమరావతి అనేది ఎప్పటికీ పూర్తికాని ఒక అంతులేని కథ. ఈ జన్మలోనే కాదు, మరో 100 జన్మలెత్తినా అది పూర్తి కాదు" అంటూ అంబటి ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు 'మూడు రాజధానుల' ద్వారా అభివృద్ధిని వికేంద్రీకరించాలని చూస్తే, చంద్రబాబు వ్యవస్థలను అడ్డం పెట్టుకుని అడ్డుకున్నారని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం అమరావతి అంశాన్ని నాన్చుతున్నారని దుయ్యబట్టారు.