టీ20ల్లో కొత్త చరిత్ర.. రోహిత్ శర్మను అధిగమించిన స్మృతి మంధాన

Smriti Mandhana Surpasses Rohit Sharma To Become Indias Highest Run Getter In T20Is
  • టీ20ల్లో భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా స్మృతి మంధాన
  • రోహిత్ శర్మ (4,231) రికార్డును అధిగమించిన భారత మహిళా బ్యాటర్
  • దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో ఈ ఘనత 
  • ప్రస్తుతం 161 మ్యాచ్‌ల్లో 4,244 పరుగులతో మంధాన అగ్రస్థానం
  • టీ20ల నుంచి రోహిత్ రిటైర్ అవ్వడంతో ఈ రికార్డు పదిలం
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. టీ20 అంతర్జాతీయ ఫార్మాట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో భారత పురుషుల జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఆమె అధిగమించింది. దక్షిణాఫ్రికాతో శుక్రవారం డర్బన్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో మంధాన ఈ అరుదైన మైలురాయిని అందుకుంది.

ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు స్మృతి మంధాన, రోహిత్ శర్మ ఇద్దరూ 4,231 పరుగులతో సమంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్ సునే లూస్ వేసిన బంతికి సింగిల్ తీయడం ద్వారా మంధాన, రోహిత్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ మ్యాచ్‌లో ఒక సిక్సర్‌తో కలిపి 13 పరుగులు చేసిన ఆమె, ఆ తర్వాత అయాబొంగా ఖాకా బౌలింగ్‌లో ఔటైంది. 

తాజా రికార్డుతో స్మృతి మంధాన 161 టీ20 మ్యాచ్‌ల్లో 30.53 సగటుతో 4,244 పరుగులు పూర్తి చేసింది. ఆమె కెరీర్‌లో ఒక సెంచరీ, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 159 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు, 32 అర్ధశతకాలతో 4,231 పరుగులు చేశాడు.

2024 టీ20 ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంధాన రికార్డును తిరిగి అధిగమించే అవకాశం అతనికి లేదు. ఫలితంగా భారత టీ20 క్రికెట్‌లో పరుగుల రాణిగా స్మృతి మంధాన స్థానం పదిలంగా నిలవనుంది.
Go Back to Shorts
Smriti Mandhana
Rohit Sharma
Team India
Cricket
Sports News

More Telugu News