ఉన్నత విద్యలో ఫేస్ రికగ్నిషన్ హాజరుపై పకడ్బందీ చర్యలు: మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు

  • ఉన్నత విద్యలో ఫేస్ అటెండెన్స్‌పై మంత్రి లోకేష్ సమీక్ష
  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి పకడ్బందీగా అమలుకు ఆదేశం
  • ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నింటికీ వర్తించనున్న కొత్త విధానం
  • పారదర్శకత, నాణ్యమైన బోధనే లక్ష్యమన్న మంత్రి
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ముఖ ఆధారిత హాజరు (ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్) విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యలో మరింత పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్‌ఎయిడెడ్ డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కాలేజీల వివరాలను, వాటిలో పనిచేస్తున్న సిబ్బంది, చదువుతున్న విద్యార్థుల ఫేస్ రికగ్నిషన్ కోసం ఇప్పటివరకు చేపట్టిన చర్యల గురించి ఆయన ఆరా తీశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు ముఖ ఆధారిత హాజరు విధానం ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ విధానం అమలులో ఎలాంటి లోపాలకు తావులేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యా కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Nara Lokesh
Face Recognition Attendance
Higher Education
Andhra Pradesh
Education Department
Kona Sasidhar
Narayana Bharat Gupta
Digital Education

More Telugu News