ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలు తగ్గుముఖం... భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • అంతర్జాతీయ పరిణామాలతో మార్కెట్లలో జోష్
  • 1,264 పాయింట్ల లాభంతో 78,111 వద్ద ముగిసిన సెన్సెక్స్
  • 388 పాయింట్లు పెరిగి 24,231 వద్ద స్థిరపడిన నిఫ్టీ
  • మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలోనూ కనిపించిన కొనుగోళ్ల ఉత్సాహం
  • బలపడిన రూపాయి, తగ్గుముఖం పట్టిన ముడిచమురు ధరలు
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేశాయి. ఇరాన్‌తో వివాదం ముగింపు దశకు వస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. దీంతో మార్కెట్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,264 పాయింట్లు లాభపడి 78,111.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 388.65 పాయింట్లు పెరిగి 24,231.30 వద్ద ముగిసింది. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో ఇన్వెస్టర్ల సంపద రూ.10 లక్షల కోట్ల మేర పెరిగింది. 

ఈ ర్యాలీ కేవలం హెవీవెయిట్ షేర్లకే పరిమితం కాలేదు. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ప్రధాన సూచీలను మించి రాణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 2.20 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 2.35 శాతం మేర లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే, నిర్మాణ రంగ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. ఐటీ, మీడియా రంగాల్లోనూ కొనుగోళ్ల ఆసక్తి కనిపించింది. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సూచీ మాత్రం వెనుకబడింది.

సాంకేతిక విశ్లేషకుల ప్రకారం, నిఫ్టీకి 24,300-24,400 స్థాయిలు కీలక నిరోధక జోన్‌గా ఉన్నాయి. ఈ స్థాయిని నిఫ్టీ బలంగా దాటితే 24,800-25,000 వైపు ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కిందకు వస్తే, 24,000 వద్ద తక్షణ మద్దతు ఉండగా, 23,900-23,800 మధ్య బలమైన మద్దతు లభించవచ్చని తెలిపారు.

మరోవైపు, అంతర్జాతీయ సానుకూల పరిణామాలతో రూపాయి కూడా బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.36 వద్ద ట్రేడ్ అయింది. గత రెండు రోజులుగా ముడిచమురు ధరలు తగ్గడం రూపాయికి కలిసివచ్చింది. బ్యారెల్ ధర 94-95 డాలర్ల శ్రేణికి దిగిరావడంతో భారత్ దిగుమతుల బిల్లుపై ఒత్తిడి తగ్గింది.

Donald Trump
Iran America tensions
stock markets
Sensex
Nifty
rupee
crude oil prices
Indian economy
global economy
geopolitical tensions

More Telugu News