పరిహారం కోసం వినూత్న నిరసన.. కలెక్టరేట్‌లో కారం చల్లిన బాధితురాలు

  • భూ సమస్య పరిష్కారం కావడం లేదనే ఆవేదనతో నిరసన
  • ఘటనతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం, గ్రామంలో భూమి సర్వే
  • పరిహారంలో అన్యాయం జరిగిందని బాధితురాలి ఆరోపణ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా పరిష్కార వేదికలో ఓ వృద్ధురాలు అధికారులపై కారం చల్లిన ఘటన కలకలం సృష్టించింది. తన భూ సమస్య ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకపోవడంతో విసిగిపోయిన ఆమె ఈ చర్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విచారణకు ఆదేశించారు.

నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన మల్లంపూడి లక్ష్మీ తులసి అనే వృద్ధురాలు గ్రీవెన్స్‌లో ఈ ఘటనకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. నందిగామ ఎంఆర్ఓ సురేష్ బాబు నేతృత్వంలోని రెవెన్యూ, సర్వే అధికారులు హుటాహుటిన అనాసాగరం గ్రామానికి చేరుకుని ఆమె భూమిని పరిశీలించారు. స్థలాన్ని కొలిచి, వివరాలు సేకరించి, సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.

జాతీయ రహదారి పక్కన తనకు 8.5 సెంట్ల స్థలం ఉండేదని, 2003, 2017లలో జరిగిన రహదారి విస్తరణ పనుల్లో కొంత భూమిని కోల్పోయానని లక్ష్మీ తులసి తెలిపారు. ప్రస్తుతం తన వద్ద 4 సెంట్లు మాత్రమే మిగిలిందని ఆమె వాపోయారు. భూసేకరణ కింద తనకు 2023లో కేవలం రూ.6.5 లక్షలు మాత్రమే ఇచ్చారని, తన పక్కనే ఉన్నవారికి అదే తరహా భూమికి రూ.24 లక్షల పరిహారం చెల్లించారని ఆమె ఆరోపిస్తున్నారు. తనకు పూర్తి పరిహారం ఇవ్వాలని, లేదా మిగిలిన భూమి హద్దులు స్పష్టంగా చూపించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

గత మూడేళ్లుగా స్థానిక అధికారుల నుంచి కలెక్టరేట్ వరకు ఎన్నోసార్లు తిరిగినా తన సమస్యను ఎవరూ పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే విసుగు చెంది ప్రజా పరిష్కార వేదికలో అధికారిపై కారం చల్లినట్లు ఆమె పేర్కొన్నారు.
 

Mallampudi Lakshmi Tulasi
NTR district
Andhra Pradesh
land compensation
collectorate
grievance redressal
farmers protest
Nandigama
revenue officials
land acquisition

More Telugu News