దేశంలోనే తొలి అటానమస్ షిప్‌యార్డ్‌గా జువ్వలదిన్నె.. మంత్రి అనగాని ప్రకటన

  • ఏపీని గ్లోబల్ మారిటైం హబ్‌గా మార్చడమే లక్ష్యమన్న మంత్రి అనగాని
  • రూ. 288.80 కోట్లతో ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు
  • జువ్వలదిన్నె పై వైసీపీ అనవసర రాద్దాంతం చేస్తోందన్న అనగాని
ఆంధ్రప్రదేశ్‌ సముద్ర వాణిజ్య రంగంలో మరో కీలక ముందడుగు పడింది. నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ప్రాజెక్టు ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ మారిటైం రోబోటిక్స్, అటానమస్ షిప్ బిల్డింగ్ హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు దేశంలోనే మొట్టమొదటి అటానమస్ మారిటైం షిప్‌యార్డుగా అవతరించబోతోందని ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికే రూ. 288.80 కోట్ల వ్యయంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను అభివృద్ధి చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కేంద్రాన్ని ఒక పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడం ద్వారా సాంకేతిక, పరిశోధన రంగాల్లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర మారిటైం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత ఐదేళ్ల జగన్ పాలనలో ఒక్క హార్బర్‌ను గానీ, పోర్టును గానీ పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక, జగన్ జువ్వలదిన్నె ప్రాజెక్టుపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మత్స్యకారుల ప్రయోజనాలను గాలికొదిలిన గత ప్రభుత్వం, ఇప్పుడు అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం సరికాదని విమర్శించారు.
 

Anagani Satya Prasad
Juvaladinne
Andhra Pradesh
Autonomous Shipyard
Maritime Robotics
Fishing Harbor
Nellore District
AP Minister
YCP Government
Global Maritime Hub

More Telugu News