పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష

రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో తలెత్తుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో పనిచేయాలని అధికారులను, ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆయన ఆదేశించారు. ప్రత్యామ్నాయంగా పీఎన్జీ వినియోగాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల కొత్త పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం జరగకూడదని, నిర్దేశిత లక్ష్యాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేరుకోవాలని తేల్చిచెప్పారు.

ఈ సమీక్షలో భాగంగా ‘దీపం’ పథకం లబ్ధిదారులను పీఎన్జీ వైపు ప్రోత్సహించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. దీపం లబ్ధిదారులు పీఎన్జీ కనెక్షన్‌కు మారితే, వారికి పథకం కింద అందే రాయితీ సొమ్మును యథావిధిగా వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు. ఈ విషయంపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, సంబంధిత ఉత్తర్వులను తక్షణమే జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. పీఎన్జీ వాడకం సురక్షితమని, చౌక అని ప్రజలకు వివరించాలన్నారు.

కేంద్రమంత్రికి ఫోన్

ప్రస్తుతం గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఇబ్బందులను అధిగమించామని, త్వరలోనే పరిస్థితి సాధారణ స్థితికి వస్తుందని అధికారులు సీఎంకు వివరించారు. ఇదే సమయంలో శ్రీకాకుళం-కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్‌లైన్ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. 

కేంద్రం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉందని అధికారులు చెప్పడంతో, సమీక్ష సమావేశం నుంచే కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి చంద్రబాబు ఫోన్ చేశారు. టెండర్ల ప్రక్రియ పూర్తయినందున, పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి, త్వరలోనే సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Chandrababu Naidu
PNG connections
Andhra Pradesh gas supply
Piped Natural Gas
LPG gas supply
Deepam scheme
Hardeep Singh Puri
Srikakulam Kakinada pipeline
Gas subsidies
Petroleum ministry

More Telugu News