సెల్ఫీ మోజులో విషాదం... జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినుల మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకునే ప్రయత్నంలో అదుపుతప్పి జలపాతంలో పడి ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన అనంతగిరి మండలం మూలగుమ్మి సమీపంలోని జలపాతం వద్ద జరిగింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే, హుకుంపేట మండలం జుంబువలస గ్రామానికి చెందిన త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16) ఇటీవల ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. మరో స్నేహితురాలు అంజలితో కలిసి నలుగురూ అనంతగిరిలోని జలపాతాన్ని చూసేందుకు వెళ్లారు. అక్కడ జలపాతం అంచున నిలబడి సెల్ఫీ దిగుతుండగా, ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు.

ఈ ప్రమాదంలో త్రిష, రత్నకుమారి, పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అంజలిని స్థానికులు గమనించి లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కసారిగా ముగ్గురు బాలికలు మృతి చెందడంతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Anantagiri Waterfall Accident
Andhra Pradesh Tragedy
Selfie Death
Student Drowned
Alluri Sitarama Raju District
Waterfall Accident India
Anjali
Tirsha
Ratnakumari
Pavitra

More Telugu News