జగన్ 'మావిగన్ జోకర్'గా మిగిలారు: షర్మిల

వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి, సొంతానికి ప్యాలెస్‌లు కట్టుకున్న జగన్.. ఇప్పుడు 'మావిగన్ జోకర్'గా మిగిలిపోయారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కేవలం వైఎస్సార్ పేరును ఉపయోగించుకున్నారో తప్ప,  ఆయన ఆశయాలకు వారసుడు కాలేకపోయారని విమర్శించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన 'ప్రజా ప్రస్థానం' పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. 2003 ఏప్రిల్ 9న చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్సార్ సాగించిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర, కాంగ్రెస్‌ను రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకమని ఆమె గుర్తుచేశారు. ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనంగా నిలిచిందన్నారు.

ఈ సందర్భంగా జగన్ పాలనపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. "వైఎస్సార్ ఐడియాలజీ నిజంగా వైసీపీలో ఉంటే, జగన్ గారు సీఎం అయ్యి కూడా జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? 'మాట తప్పం మడమ తిప్పం' అనే వైఎస్సార్ నినాదాన్ని వాడుకుంటూ, సంపూర్ణ మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి, కల్తీ మద్యం అమ్ముతూ 'ఓన్లీ క్యాష్' మాఫియా ఎందుకు నడిపారు?" అని నిలదీశారు. 

వైఎస్సార్ జీవితకాలం వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా ఎలా మారారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా క్రైస్తవ మైనారిటీలపై దాడులు జరుగుతున్నా వైఎస్సార్ వారసుడిగా జగన్ ఎందుకు ఖండించలేదని, ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు.

వైఎస్సార్ హయాంలోనే సంక్షేమానికి అసలైన అర్థం లభించిందని షర్మిల అన్నారు. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ ఇళ్లు, పావలా వడ్డీ రుణాలు, 108/104 సేవలు వంటి ప్రతి పథకం ప్రజల కన్నీళ్ల నుంచి పుట్టిందేనని కొనియాడారు. 

వైఎస్సార్ ఐడియాలజీ బతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనేనని, ఆయన ఆశయాలు మళ్లీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైఎస్సార్ అభిమానులందరూ హస్తంతో జతకట్టాలని, ఆనాటి సంక్షేమ పాలనను మళ్లీ తీసుకొద్దామని పిలుపునిచ్చారు. "వైఎస్సార్ అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే వైఎస్సార్" అని ఆమె పునరుద్ఘాటించారు.

YS Sharmila
Jagan Mohan Reddy
YS Jagan
Andhra Pradesh Congress
AP Politics
YS Rajasekhara Reddy
Praja Prasthanam
Congress Party
Three Capitals
Corruption

More Telugu News