రాజశేఖరరెడ్డి పాదయాత్రకు 23 ఏళ్లు.. జగన్ స్పందన
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన చారిత్రాత్మక పాదయాత్రకు నేటితో (ఏప్రిల్ 9) 23 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, వైసీపీ అధినేత జగన్ తన తండ్రి స్మృతులను నెమరువేసుకున్నారు. ఎక్స్ వేదికగా ఆయన భావోద్వేగంతో కూడిన ఒక ట్వీట్ చేశారు.
2003 ఏప్రిల్ 9వ తేదీన ఎర్రటి ఎండలో వైఎస్సార్ మొదలుపెట్టిన పాదయాత్ర కేవలం ఒక ప్రయాణం కాదని, అది రాష్ట్ర రాజకీయ చరిత్రనే తిరగరాసిన అపూర్వ ఘట్టమని జగన్ కొనియాడారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు సాగిన ఆ యాత్ర, జన హృదయాల్లో 'నేనున్నాననే భరోసా' నింపిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్పై తొలి సంతకం చేసి, రైతన్నలను రాజులుగా నిలబెట్టిన ఘనత వైఎస్సార్దేనని జగన్ అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేద పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అయ్యేలా చేయడంతో పాటు, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలకు ప్రాణదాతగా నిలిచారని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం పనుల వేగవంతం ద్వారా రాష్ట్ర రూపురేఖలను ఆయన మార్చేశారని వివరించారు.
వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, తన తండ్రి బాటలోనే ప్రజల కోసం తన ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు.