నెలలో 3 రోజులు అంటరానితనమా?: శబరిమల కేసులో జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్య

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై జరుగుతున్న రాజ్యాంగపరమైన విచారణలో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. "ఒక మహిళగా చెబుతున్నా, నెలలో మూడు రోజులు అంటరానితనం పాటించి, నాలుగో రోజు అది లేదనడం సరికాదు" అని ధర్మాసనంలోని ఏకైక మహిళా న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న మంగళవారం వ్యాఖ్యానించారు. అంటరానితనాన్ని నిషేధించే ఆర్టికల్ 17ను మహిళల విషయంలో కొన్ని రోజులకే పరిమితం చేయలేమని ఆమె స్పష్టం చేశారు.

రుతుక్రమం ఆధారంగా మహిళల ప్రవేశాన్ని నిరాకరించడాన్ని ‘అంటరానితనం’తో పోలుస్తూ 2018 నాటి తీర్పులో చేసిన వ్యాఖ్యలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలను అంటరానివారిగా చూస్తున్నారనే అభిప్రాయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన చెప్పగా, జస్టిస్ నాగరత్న పై విధంగా స్పందించారు. 2018లో శబరిమల కేసు తీర్పు సందర్భంగా, నెలసరి పేరుతో మహిళలపై ఆంక్షలు విధించడం ఒకరకమైన అంటరానితనమేనని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.

తాను రుతుక్రమానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని మెహతా స్పష్టం చేశారు. శబరిమల ఆలయంలోని ఆంక్షలు కొన్ని రోజులకు సంబంధించినవి కాదని, ఒక నిర్దిష్ట వయసు మహిళలకు సంబంధించినవని వివరించారు. దేశంలోని ఇతర అయ్యప్ప ఆలయాల్లో, ఢిల్లీలో సైతం మహిళలందరికీ ప్రవేశం ఉందని, కేవలం శబరిమల ఆలయం మాత్రమే ఒక ప్రత్యేకమైన కేసని ఆయన వాదించారు.

అంతకుముందు, మతంలో ఏవి అత్యవసర ఆచారాలు (Essential Religious Practices) అనేది కోర్టులు నిర్ణయించరాదని తుషార్ మెహతా వాదనలు ప్రారంభించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(2)(b) ప్రకారం మత సంస్కరణలు చేపట్టే అధికారం కేవలం శాసనసభలకే ఉందని కేంద్రం తరఫున ఆయన తెలిపారు. శబరిమల తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్ల విచారణ సందర్భంగా తలెత్తిన విస్తృత రాజ్యాంగపరమైన ప్రశ్నలను తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం విచారిస్తోంది. తాము శబరిమల తీర్పు జోలికి వెళ్లడం లేదని, కేవలం రాజ్యాంగపరమైన అంశాలనే పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. 

Justice Nagarathna
Sabarimala Temple
Women entry
Supreme Court
Menstruation
Article 17
Untouchability
Tushar Mehta
Essential Religious Practices

More Telugu News