రాష్ట్రంలో ప్రతి ఉద్యోగాన్ని పక్కాగా ట్రాక్ చేయాలి: మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి ఉద్యోగాన్ని పక్కాగా ట్రాక్ చేయాలని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసంలో మంగళవారం 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. 

రాష్ట్రానికి ఇప్పటివరకు వచ్చిన పరిశ్రమలు, వాటి ద్వారా కల్పించిన ఉద్యోగాలు, ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్న ప్రాజెక్టుల గ్రౌండింగ్ పురోగతిపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటివరకు రాష్ట్ర యువతకు వివిధ రంగాల్లో 6.25 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, "యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మేము వాగ్దానం చేశాం. ఆ లక్ష్య సాధనకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలి. నైపుణ్యం పోర్టల్ తరహాలోనే, ఆధార్ లేదా కేవైసీ అనుసంధానంతో ప్రతి ఉద్యోగాన్ని ట్రాక్ చేసేందుకు ఒక బలమైన వ్యవస్థను రూపొందించాలి" అని స్పష్టం చేశారు. ప్రభుత్వ దృష్టిలో చిన్న పరిశ్రమలు, పెద్ద పెట్టుబడులు రెండూ సమానమేనని, ఉద్యోగాల కల్పనే తమకు అత్యంత ముఖ్యమని ఆయన తేల్చిచెప్పారు. పెట్టుబడుల గ్రౌండింగ్‌పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని, క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. దీనిపై ప్రతివారం సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు.

పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియను సింగపూర్, దుబాయ్ కంటే సులభతరం చేయాలని మంత్రి లోకేశ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. "పరిశ్రమలకు అవసరమైన అన్ని శాఖల అనుమతులు, నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) మ్యాపింగ్ చేసి, వాటి పురోగతిని పర్యవేక్షించేందుకు ఒక ట్రాకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలి. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న 787 కంపెనీలను నిరంతరం ట్రాక్ చేస్తూ, అవి కార్యరూపం దాల్చేలా చూడాలి" అని ఆదేశించారు. 

ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఈడీబీ)ను మరింత బలోపేతం చేయాలని, ప్రతి శాఖ ఈడీబీ ట్రాకర్‌ను పర్యవేక్షించేందుకు ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌ను నియమించాలని సూచించారు. ఎంఎస్ఎంఈ పార్కులు, టెక్స్‌టైల్ ఇండస్ట్రీకి పవర్ బ్యాంకింగ్ వంటి అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, పి. నారాయణ, గొట్టిపాటి రవికుమార్, కందుల దుర్గేశ్, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్, పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Nara Lokesh
Andhra Pradesh jobs
AP jobs
2 million jobs
Job creation
AP government
Skills development
TG Bharat
Kollu Ravindra

More Telugu News