అభివృద్ధి, అవినీతిలో మీ రాష్ట్రం స్థానమెంత? రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన కేరళ సీఎం విజయన్

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ, రాజకీయ మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై కేరళ ముఖ్యమంత్రి, ఎల్‌డీఎఫ్ నేత పినరయి విజయన్ సుదీర్ఘమైన, ఘాటైన సమాధానం ఇచ్చారు. రాజకీయ విభేదాలు సహజమే అయినా, వ్యక్తిగత దూషణలతో కూడిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ జవాబుదారీతనం ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలప్పుడు మాత్రమే కాదని, నిరంతర ప్రక్రియ అని, తమ ప్రగతి నివేదికలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశారు.

చరిత్రను వక్రీకరించద్దు...

కేరళ సామాజిక సూచికల ఘనతను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విజయన్ ఆరోపించారు. చారిత్రక వాస్తవాలను గుర్తుచేస్తూ.. "స్వాతంత్ర్యం వచ్చిన మొదటి దశాబ్దంలోనే భూస్వామ్య వ్యవస్థకు ముగింపు పలికేందుకు తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం 'భూసంబంధాల బిల్లు'ను తీసుకొచ్చింది. కానీ, అప్పుడు కేంద్రంలో ఉన్న మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి మా ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేసింది. 1993 నాటి 73, 74వ రాజ్యాంగ సవరణలకు దశాబ్దాల ముందే మా ప్రభుత్వం వికేంద్రీకృత పాలనకు బీజం వేసింది. 1980లలో అక్షరాస్యత ఉద్యమానికి, 1996లో ప్రజా ప్రణాళికా ప్రచారానికి నాంది పలికింది కూడా ఎల్‌డీఎఫ్ ప్రభుత్వమే" అని వివరించారు.

గణాంకాలతో తెలంగాణతో పోలిక..

జాతీయ సూచీలను ఉటంకిస్తూ తెలంగాణతో కేరళను పోల్చారు. "నీతి ఆయోగ్ ప్రకారం, దేశంలో అత్యంత తక్కువ అవినీతి ఉన్న రాష్ట్రం కేరళ. అదే సమయంలో, అత్యధిక అవినీతి గల రాష్ట్రాల జాబితాలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది. జాతీయ సుస్థిరాభివృద్ధి సూచీలో మేము 79 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంటే, మీరు 6వ స్థానంలో ఉన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కరణల్లో కూడా కేరళ నంబర్ వన్ స్థానంలో నిలిచింది" అని విజయన్ పేర్కొన్నారు. తాము 'నవ కేరళ మిషన్ల' ద్వారా కొలవదగిన ఫలితాలు సాధిస్తున్నామని, 'ఆర్ద్రం మిషన్' కింద 670 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునిక కుటుంబ ఆరోగ్య కేంద్రాలుగా మార్చామని తెలిపారు. 13,000 ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతీకరించామని, 45,000 తరగతి గదులను హైటెక్ సౌకర్యాలతో తీర్చిదిద్దామని వివరించారు.

మౌలిక సదుపాయాలు, పేదరిక నిర్మూలన..

గత కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ రహదారుల విస్తరణ, గెయిల్ పైప్‌లైన్, ఎడమన్-కొచ్చి పవర్ హైవే వంటి కీలక ప్రాజెక్టులను గాలికొదిలేస్తే, తమ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వమే వాటిని పునరుద్ధరించి పూర్తి చేసిందని విజయన్ తెలిపారు. కొచ్చి మెట్రో, విళింజం అంతర్జాతీయ ఓడరేవు ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి గత కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాలే కారణమని ఆరోపించారు. 2025 నవంబర్ 1 నాటికి దేశంలోనే తీవ్ర పేదరికం లేని ఏకైక రాష్ట్రంగా కేరళ నిలిచిందని, 'ఎక్స్‌ట్రీమ్ పావర్టీ ఎరాడికేషన్ ప్రాజెక్ట్' (EPEP) ద్వారా 64,006 కుటుంబాలను ఆదుకున్నామని గర్వంగా ప్రకటించారు.

బీజేపీపై పోరాడుతున్నది మేమే..

ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం బీజేపీని విమర్శించడం లేదన్న రేవంత్ ఆరోపణలను విజయన్ తిప్పికొట్టారు. "రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఆర్టికల్ 131, 32 కింద న్యాయపోరాటం చేస్తున్నది కేరళ ప్రభుత్వమే. 16వ ఆర్థిక సంఘం విషయంలో బీజేపీయేతర రాష్ట్రాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మేమే ప్రయత్నిస్తున్నాం. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కేంద్ర ప్రభుత్వ చర్యలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బలమైన వైఖరిని ప్రదర్శించడానికి హుందాతనాన్ని దాటి మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము వెనుకకు వెళ్ళం, కేవలం ముందుకు మాత్రమే సాగుతాం. అందరికీ ఆదర్శంగా నిలిచే 'నవ కేరళ'ను నిర్మించి తీరుతాం" అని పినరయి విజయన్ తన సుదీర్ఘ ప్రకటనలో స్పష్టం చేశారు.

Pinarayi Vijayan
Kerala
Telangana
Revanth Reddy
Kerala Assembly Elections
Corruption
Development
LDF
NITI Aayog
Ease of Doing Business

More Telugu News