శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం.. సుప్రీంకోర్టులో కేంద్రం వివరణ

శబరిమల ఆలయంతో సహా మతపరమైన ప్రదేశాలలో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై, వివిధ మతాలు పాటించే మత స్వేచ్ఛ యొక్క పరిధి, విస్తృతికి సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనం తుది విచారణను ప్రారంభించింది. కేంద్రం ఇప్పటికే తన వివరణను సమర్పించగా, పిటిషన్‌దారుల వాదనలను సుప్రీంకోర్టు వింటోంది.

ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాలకు అనుగుణంగానే మహిళల నిషేధం కొనసాగుతోంది తప్ప ఇందులో వివక్ష లేదని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. మహిళల ప్రవేశాన్ని అనుమతించడం సరికాదని కోరారు. ఇది ఆరాధనా స్వరూపాన్ని మార్చివేస్తుందని పేర్కొన్నారు. ప్రాచీన కాలం నుంచి వస్తోన్న ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగానే భక్తులందరూ స్వామి వారిని పూజిస్తున్నారని తెలిపారు.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది పూర్తిగా మత విశ్వాసాలకు సంబంధించిన అంశమని కోర్టుకు తెలిపారు. ఇది న్యాయ సమీక్షకు అతీతమైనదని అన్నారు. శబరిమల ఆలయంలో ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆంక్షలు కొనసాగేలా చూడాలని సుప్రీంకోర్టును కోరారు.

శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మహిళలకు అనుమతి ఉండదు. మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. మహిళల ప్రవేశంపై నిషేధాన్ని రద్దు చేస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసును సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం తన వివరణను సమర్పించింది.

Sabarimala Temple
Women entry
Supreme Court
Tushar Mehta
Religious freedom
Ayyappa Temple

More Telugu News