Matrize Survey: మ్యాట్రిజ్‌ సర్వే: తమిళనాడు, కేరళలో అధికారం మార్పు ఖాయం!

Matrize Survey Predicts Government Change in Tamil Nadu Kerala
షార్ట్స్‌లో చూడండి
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో రెండు చోట్ల ప్రభుత్వాలు మారే అవకాశం ఉందని మ్యాట్రిజ్‌ సర్వే సంస్థ అంచనా వేసింది. తమిళనాడు, కేరళలో అధికార మార్పిడి జరగవచ్చని, పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరు తప్పదని తన తాజా సర్వేలో వెల్లడించింది. అసోంలో మాత్రం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్‌ విజయం సాధించడం ఖాయమని స్పష్టం చేసింది.

సర్వే ప్రకారం తమిళనాడులో అధికార డీఎంకే కూటమికి గట్టి ఎదురుగాలి వీస్తోంది. విపక్ష అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి స్వల్ప ఆధిక్యంతో అధికారం దిశగా మొగ్గు చూపుతోంది. ఎన్డీఏకు 107-120, డీఎంకే కూటమికి 102-115 సీట్లు రావచ్చని అంచనా. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 16 శాతం ఓట్లతో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కేరళలో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ అధికారంలోకి రానున్నట్లు సర్వే తెలిపింది. యూడీఎఫ్‌ కూటమికి 67-73 సీట్లు, అధికార ఎల్‌డీఎఫ్‌కు 62-68 సీట్లు దక్కవచ్చని పేర్కొంది.

పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా పోరు సాగనుంది. టీఎంసీకి 140-160 సీట్లతో స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ, బీజేపీ 130-150 సీట్లతో గట్టిపోటీ ఇస్తోంది. రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా కేవలం 2 శాతమే కావడంతో ఫలితం ఎలాగైనా ఉండొచ్చని సర్వే అభిప్రాయపడింది. ఇక అసోంలో మాత్రం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సారథ్యంలో బీజేపీ కూటమి 92-102 స్థానాలతో వరుసగా మూడోసారి సునాయాసంగా గెలుస్తుందని మ్యాట్రిజ్‌ అంచనా వేసింది.
Go Back to Shorts
Matrize Survey
Tamil Nadu Elections
Kerala Elections
West Bengal Elections
Assam Elections
DMK
AIADMK
Mamata Banerjee
BJP
Assembly Elections 2024

More Telugu News