Sajjala Ramakrishna Reddy: 'కమ్మరావతి' అని రేణుకా చౌదరి అంటే... నారా లోకేశ్ చప్పట్టు కొట్టాడు: సజ్జల రామకృష్ణారెడ్డి
అమరావతి రాజధాని విషయంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇన్నిరోజులు అమరావతికి చట్టబద్ధత లేదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ అంశాన్ని మూడు ముక్కలాట అంటూ వెటకారం చేశారని మండిపడ్డారు. గతంలోనే రాజధానికి చట్టబద్ధత ఉందని, ఇప్పుడు కొత్తగా చెబుతున్నవన్నీ అబద్ధాలని ఆయన మండిపడ్డారు.
రాజధాని నిర్మాణం వల్ల రాష్ట్రంపై ఆర్థిక భారం పడకూడదన్నదే జగన్ ఆలోచన అని సజ్జల తెలిపారు. అందుకోసమే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని ఉండాలని జగన్ ప్రతిపాదించారని గుర్తుచేశారు. చంద్రబాబు రాజధానిని ఒక 'గ్రోత్ ఇంజిన్'లా కాకుండా, ప్రజాధనాన్ని తోడేసే 'మోటారు'లా వాడుకుంటున్నారని ఆరోపించారు. అనవసరమైన విధంగా రేట్లు పెంచి, కాంట్రాక్టుల పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.
పార్లమెంట్లో రేణుకా చౌదరి అమరావతిని 'కమ్మరావతి' అని సంబోధించినప్పుడు టీడీపీ ఎంపీలు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. లోకేశ్ ఆ వ్యాఖ్యలకు చప్పట్లు కొట్టడం ద్వారా అమరావతిపై కులముద్రను వారే బలపరిచారని ఆరోపించారు. అమరావతిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని, కానీ జగన్ మాత్రం ఇక్కడే ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించుకున్నారని సజ్జల పేర్కొన్నారు.
రూ. 2 లక్షల కోట్ల అప్పులతో సాధ్యం కాని ప్రాజెక్టుపై సంబరాలు చేసుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడం అన్యాయమని సజ్జల అన్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఈ సంబరాల పిలుపును తిరస్కరించారని, ప్రభుత్వ ఆదేశాలను అధికారులు కూడా పట్టించుకోలేదని ఆయన వ్యాఖ్యానించారు.