Kesineni Chinni: జగన్ ఒక కామెడీ పీస్: కేశినేని చిన్ని
వైసీపీ అధినేత జగన్ పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతి రాజధాని విషయంలో జగన్ చేస్తున్న 'మావిగన్' వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. జగన్ ను రాష్ట్ర రాజకీయాల్లో ఒక కామెడీ పీస్ గా అభివర్ణించారు. రాజధాని వంటి మహత్తరమైన అంశాన్ని జగన్ హాస్యాస్పదంగా మార్చారని, ఆయన మాటలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని మండిపడ్డారు.
అమరావతికి పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించడం వైసీపీకి మింగుడు పడటం లేదని ఎంపీ విమర్శించారు. ఈ చారిత్రాత్మక బిల్లు ఆమోదం పొందే సమయంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని, అమరావతి శాశ్వత రాజధాని కావడం పట్ల రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కృషిని దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కొనియాడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జగన్, వైసీపీ త్వరలోనే కనుమరుగవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.