Jagan Mohan Reddy: జగన్ ఓడిపోయినా సైకో లక్షణాలు ఇంకా పోలేదు: మంత్రి జనార్దన్ రెడ్డి ఫైర్

వైసీపీ అధ్యక్షుడు జగన్ 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనా ఆయనలో సైకో లక్షణాలు ఇంకా పోలేదని, రాష్ట్రాభివృద్ధికి అడ్డంకిగా మారి నిత్యం విషం చిమ్ముతున్నారని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచమంతా అమరావతిని ఏకైక రాజధానిగా స్వాగతిస్తుంటే, పార్లమెంట్‌లో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే.. జగన్, ఆయన ముఠా మాత్రం విష ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

"రాజధానిపై సాక్షి మీడియాలో జగన్ రెడ్డే ప్రశ్నలు వేసుకొని, ఆయనే సమాధానాలు చెప్పుకుంటున్నారు. గతంలో మూడు రాజధానుల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఐదేళ్లు నరకం చూపించారు. ఇప్పుడు ప్రజా రాజధానికి దేశమంతా మద్దతిస్తుంటే, వైసీపీ ఎంపీలు పార్లమెంట్ నుంచి పారిపోయారు. దీన్నిబట్టే రాష్ట్రాభివృద్ధిపై వారికున్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది" అని మంత్రి విమర్శించారు.

రాయలసీమ ద్రోహి జగన్
రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశారని బీసీ జనార్థన్ రెడ్డి ఆరోపించారు. సీమకు నీళ్లిస్తే బంగారం పండిస్తారన్న సిద్ధాంతంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తుంటే, జగన్ మాత్రం అభివృద్ధికి అడ్డుపడుతున్నారని అన్నారు. "రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలని సవాల్ విసిరితే జగన్ పారిపోతున్నారు. తన ఐదేళ్ల పాలనలో రూ.12 లక్షల కోట్ల బడ్జెట్‌లో కనీసం రూ.2 వేల కోట్లు కూడా సీమ ప్రాజెక్టులకు ఖర్చు చేయని వ్యక్తి, ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారు" అని ఎద్దేవా చేశారు.

కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే రూ.8,000 కోట్లతో రాయలసీమ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. 738 కి.మీ. దూరంలో ఉన్న కుప్పానికి రూ.3,870 కోట్లతో హంద్రీనీవా నీటిని అందించిన ఘనత చంద్రబాబుదని గుర్తుచేశారు. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.203 కోట్లు కేటాయించామని, అవుకు రిజర్వాయర్ పనులను పూర్తి చేసి 20 వేల క్యూసెక్కుల నీటిని తరలించామని తెలిపారు. పులివెందులకు నీళ్లు తెచ్చిన చరిత్ర కూడా చంద్రబాబుదేనని స్పష్టం చేశారు.

ఇసుక దోపిడీకి 39 మంది బలి
జగన్ పాలనలో ఇసుక దోపిడీ, నిర్వహణ లోపం వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయి 39 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 365 ద్వారా 102 సాగునీటి ప్రాజెక్టుల పనులను రద్దు చేసి, డ్యాముల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా జగన్ రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వ వేధింపుల వల్లే అల్ట్రాటెక్ వంటి పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్లిపోయాయని, ఇప్పుడు తాము ఓర్వకల్లును ఇండస్ట్రియల్ హబ్‌గా మార్చి లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెప్పారు. 

కర్నూలు ఎయిర్‌పోర్ట్ కట్టింది, ఓర్వకల్లును అభివృద్ధి చేసింది టీడీపీ అయితే, ఏ సంబంధం లేని తన తండ్రి విగ్రహాలను అక్కడ పెట్టుకోవడం జగన్ నైజమని విమర్శించారు. రాయలసీమ అభివృద్ధి, సంక్షేమం కేవలం చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని ఆ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతున్నారని, 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పినా జగన్ తీరు మారలేదని అన్నారు.
Jagan Mohan Reddy
YS Jagan
Janardhan Reddy
Andhra Pradesh
Amaravati
Rayalaseema
TDP
Chandrababu Naidu
YS Jagan Mohan Reddy
AP Politics

More Telugu News