Koushik Reddy: భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శనివారం హైదరాబాద్లోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. జనవరి 29న సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా హుజూరాబాద్లో రోడ్డుపై బైఠాయించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. పోలీస్ కమిషనర్ ను దూషించారనే ఆరోపణలతో కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేయడంతో, అధికారులు కౌశిక్ రెడ్డితో పాటు ఆయన భార్యకు కూడా నోటీసులు జారీ చేశారు. దీంతో ఇరువురు విచారణకు హాజరుకాగా, సీఐడీ డీఎస్పీ రంగస్వామి వారిని విచారిస్తున్నారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హుజూరాబాద్లోని డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా తాను చేపట్టదలచిన నిరసనను అడ్డుకోవడానికే, కావాలని నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని ఆరోపించారు. తనతో పాటు తన భార్యకు నోటీసులు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటో అర్థం కావడం లేదన్నారు. చట్టంపై గౌరవంతోనే విచారణకు వచ్చానని చెబుతూనే, నోటీసులు ఇవ్వాల్సి వస్తే హుజూరాబాద్లో ఫైరింగ్ జరిపిన కరీంనగర్ సీపీకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.