Acham Naidu: అమరావతిపై జగన్ పగబట్టారు.. అందుకే 'మావిగన్' అంటున్నారు: మంత్రి అచ్చెన్నాయుడు

Acham Naidu Slams Jagan Over Amaravati Politics
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ విధ్వంసం సృష్టిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయం సాధించారని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. రాజధాని పనులు తిరిగి ప్రారంభం కావడం, అమరావతికి చట్టబద్ధత ఏర్పడడం వంటి పరిణామాలతో గత వారం రోజులుగా రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు పండుగ చేసుకుంటున్నారని ఆయన అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని అమరావతిపై జగన్ పగబట్టి విధ్వంసం సృష్టించారని, ఇప్పుడు 'మావిగన్' పేరిట మరో డ్రామాకు తెరలేపారని ఆరోపించారు.

దేశంలో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్, అయోధ్య రామమందిరం వంటి అనేక అంశాలపై రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాలేదని, కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మాత్రం అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తే, ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. "తెలుగు జాతిపైనా, అమరావతిపైనా జగన్ కి ఎందుకంత కక్ష?" అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోరని, 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే పనిచేస్తారని స్పష్టం చేశారు.

2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడదీశారని, అప్పుడు కాంగ్రెస్‌లో కీలకపాత్ర పోషించిన వైసీపీ నేతలు రాష్ట్రానికి రాజధానిని సాధించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 2014లో ప్రజలు విచక్షణతో చంద్రబాబును గెలిపించారని, ఆయన అధికారంలోకి రాగానే 13 గంటల పాటు శాసనసభలో చర్చించి, అన్ని పార్టీల ఆమోదంతోనే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని వివరించారు. అప్పుడు ఇదే జగన్, నిండు సభలో అమరావతికి సంపూర్ణ మద్దతు తెలిపి, తాను కూడా ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారని గుర్తుచేశారు.

కానీ 2019లో 'ఒక్క అవకాశం' అంటూ ప్రజలను మాయమాటలతో నమ్మి అధికారంలోకి వచ్చాక, జగన్ తన మాట మార్చారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అమరావతిని శ్మశానం, ఎడారితో పోలుస్తూ, ఒక కులానికే రాజధాని కడుతున్నారంటూ విష ప్రచారం చేశారని ఆరోపించారు. రాజధానిలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేసినా, ఒక్కటీ నిరూపించలేకపోయారని అన్నారు. అమరావతి అనేది ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చులేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియకుండా తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. రాజధాని కోసం 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా 34 వేల ఎకరాల భూమి ఇస్తే, వారి త్యాగాన్ని జగన్ అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను మోసం చేశారని, కానీ ఏ ఒక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని అన్నారు. ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో మరో కొత్త నాటకానికి తెరలేపారని, ప్రజలు మరోసారి తిరగబడితే రాజకీయాల్లోనే లేకుండా చేస్తారని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు మళ్లీ వేగవంతం అయ్యాయని, తెలుగు ప్రజల భవిష్యత్తు అయిన అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగుతుందని, దాని ద్వారానే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Acham Naidu
Jagan Mohan Reddy
Amaravati
Andhra Pradesh
Capital City
TDP
YSRCP
Chandrababu Naidu
Politics
Mavigan

More Telugu News