Nara Lokesh: కర్ణాటక పర్యటనలో మంత్రి లోకేశ్‌.. సింధనూరులో అపూర్వ స్వాగతం

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ కర్ణాటక పర్యటనలో అపూర్వ స్వాగతం లభించింది. రాయచూర్ జిల్లా సింధనూరు చేరుకున్న ఆయనకు స్థానిక తెలుగు సంఘాలు, యువత, అభిమానులు, వివిధ పార్టీల నాయకులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్‌తో కలిసి లోకేశ్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో కర్ణాటకలోని తెలుగు ప్రజలు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. సుమారు 53 రోజుల పాటు సింధనూరు, రాయచూర్ ప్రాంతాల్లో నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. ఒక్క సింధనూరులోనే 10 వేల మందితో భారీ ర్యాలీ చేపట్టారు. ఆ కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపేందుకే లోకేశ్‌ ఈ పర్యటన చేపట్టారు. సింధనూరు చేరుకున్న ఆయనకు మాజీ మంత్రి, జేడీఎస్ నేత వెంకటరావు నాడగౌడ, స్థానిక ఎమ్మెల్యే హంపన్న గౌడ, బీజేపీ నేత కే. కరియప్ప సహా పలువురు పార్టీలకతీతంగా ఘన స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా ఎంజీ సర్కిల్ నుంచి హోసళ్లీ క్యాంపు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి లోకేశ్‌తో పాటు కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్ కూడా ప్రచార రథంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా యువగళం జెండాలు చేతబూనిన యువత, ప్రజలు పూలు చల్లుతూ 'జై లోకేశ్‌' అంటూ నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. లోకేశ్‌ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో ఫొటోలు దిగుతూ ముందుకు సాగారు.

పర్యటనలో భాగంగా సింధనూరు హోసళ్లీ క్యాంపులోని కమ్మవారి కళ్యాణమండపంలో ఏర్పాటు చేసిన దివంగత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేశ్‌ ఆవిష్కరించనున్నారు. అనంతరం శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొననున్నారు.
Nara Lokesh
Karnataka tour
Sindhanur
Telugu community
HD Kumaraswamy
Sanjay Seth
Chandrababu Naidu arrest
Rally
JDS
Andhra Pradesh IT Minister

More Telugu News