CBSE: సీబీఎస్ఈలో కీలక మార్పులు.. 6వ తరగతి నుంచి త్రిభాషా విధానం తప్పనిసరి

CBSE Key Changes Three Language Formula Mandatory From 6th Grade
షార్ట్స్‌లో చూడండి
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి నూతన పాఠ్య ప్రణాళికను అమలు చేయనుంది. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఈ మార్పులు చేస్తున్నట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా 6వ తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని తప్పనిసరి చేయడంతో పాటు, 9వ తరగతి విద్యార్థులకు గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది.

కొత్త నిబంధనల ప్రకారం 9వ తరగతి నుంచి గణితం, సైన్స్‌లో రెండు స్థాయిల విధానం అమల్లోకి వస్తుంది. ఐఐటీ వంటి ఉన్నత స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం అదనంగా ఒక ఐచ్ఛిక పేపర్‌ను అందిస్తారు. ఈ ఐచ్ఛిక పరీక్ష 25 మార్కులకు ఉంటుంది. ఇందులో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధిస్తే, ఆ విషయాన్ని మార్కుల షీట్‌లో ప్రత్యేకంగా చూపిస్తారు. అయితే, ఈ మార్కులను 80 మార్కులకు నిర్వహించే ప్రధాన పరీక్ష ఫలితాలతో కలపరు.

ఇప్పటివరకు కొన్ని పాఠశాలలకే పరిమితమైన త్రిభాషా విధానం ఇకపై 6వ తరగతి నుంచి దేశవ్యాప్తంగా అన్ని సీబీఎస్ఈ స్కూళ్లలో తప్పనిసరి కానుంది. విద్యార్థులు చదివే మూడు భాషల్లో కనీసం రెండు భారతీయ భాషలై ఉండాలి. విదేశాల నుంచి తిరిగివచ్చే విద్యార్థులకు ఈ విషయంలో కొంత మినహాయింపు ఉంటుందని బోర్డు తెలిపింది.

వీటితో పాటు 9, 10 తరగతుల విద్యార్థులకు ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులను కూడా తప్పనిసరి చేస్తున్నట్లు సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ మార్పులు దశలవారీగా అమలవుతాయని, విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించి, నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యమని అధికారులు వివరించారు.
Go Back to Shorts
CBSE
Central Board of Secondary Education
New Education Policy
Three Language Formula
Mathematics Science
Curriculum Changes
Indian Languages
Vocational Education
CBSE Schools

More Telugu News