IPL 2024: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు... హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు, ట్రాఫిక్ ఆంక్షలను ప్రకటించారు. ఏప్రిల్ 5 నుంచి మే 22 వరకు ఏడు మ్యాచ్‌లు జరగనున్న నేపథ్యంలో, మ్యాచ్ జరిగే రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని మల్కాజ్‌గిరి, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు వెల్లడించాయి. సుమారు 39,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేస్తున్నందున, ట్రాఫిక్ రద్దీని నియంత్రించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఈ చర్యలు తీసుకుంటున్నారు.

ట్రాఫిక్ అడ్వైజరీ ప్రకారం, మ్యాచ్ జరిగే రోజుల్లో భారీ వాహనాలపై కఠిన ఆంక్షలు విధించారు. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు వచ్చే లారీలు, ఇతర భారీ వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) మీదుగా మళ్లిస్తారు. ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వైపు, ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలను నాగోల్, బోడుప్పల్ వైపు దారి మళ్లిస్తారు. సాధారణ ప్రయాణికులు కూడా రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

భద్రతా ఏర్పాట్లలో భాగంగా దాదాపు 2వేల మంది పోలీసు సిబ్బందిని మోహరిస్తున్నారు. వీరిలో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు, ప్రత్యేక బలగాలు, షీ టీమ్స్, బాంబ్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయి. స్టేడియం పరిసరాల్లో 430 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను కేటాయించగా, స్టేడియం సమీపంలోని ప్రధాన రహదారులపై వాహనాలు నిలపడాన్ని పూర్తిగా నిషేధించారు.

స్టేడియంలోకి ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, బ్యాగులు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహారం, సిగరెట్లు వంటి వస్తువులను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. మ్యాచ్ వీక్షించడానికి వచ్చేవారు వ్యక్తిగత వాహనాలకు బదులుగా మెట్రో, ఆర్టీసీ బస్సుల వంటి ప్రజారవాణా సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.
IPL 2024
Uppal Stadium
Hyderabad Traffic
IPL Matches
Rajiv Gandhi International Stadium
Hyderabad Police
Traffic Advisory
Cricket Stadium
Telangana
Traffic Restrictions

More Telugu News