Mahesh Kumar Goud: బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషంగా ఉన్నారు: మహేశ్ కుమార్ గౌడ్

తమ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ పుట్టిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో 70 శాతం జిల్లా అధ్యక్షులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని తెలిపారు.

కార్యకర్తలు కష్టపడితేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ పార్టీయే శాశ్వతమని గుర్తుంచుకోవాలని అన్నారు. పార్టీ కోసం కాంగ్రెస్ కార్యకర్తలు జైళ్లకు పోయారని, లాఠీ దెబ్బలు తిన్నారని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ హయాంలో లక్షల కోట్లు అప్పులు చేశారని, దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణలో భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరో ఇరవై ఏళ్లు పార్టీ అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. విద్య, వైద్య రంగంపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దృష్టి సారించిందని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు.
Mahesh Kumar Goud
Telangana Congress
Indiramma Houses
Komaram Bheem Asifabad
TPCC President

More Telugu News