Denis Manturov: మరింత చమురు కావాలా... మేం సరఫరా చేస్తాం!: భారత్‌కు రష్యా ఓపెన్ ఆఫర్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్న వేళ, భారత్‌కు రష్యా కీలకమైన ప్రతిపాదన చేసింది. దేశీయ అవసరాల కోసం క్రూడ్ ఆయిల్, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్ జీ) సరఫరాను మరింత పెంచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. భారత పర్యటనలో ఉన్న రష్యా మొదటి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ ఈ మేరకు హామీ ఇచ్చారు.

ఏప్రిల్ 2న ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లతో మంటురోవ్ సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యారు. ఈ చర్చల్లో ఇంధన రంగంలో ద్వైపాక్షిక సహకారం ప్రధాన అంశంగా నిలిచింది. "భారత మార్కెట్‌కు స్థిరంగా చమురు, ఎల్‌ఎన్‌జీ సరఫరాను పెంచే సత్తా తమ కంపెనీలకు ఉంది" అని మంటురోవ్ స్పష్టం చేసినట్లు రష్యా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది.

పశ్చిమాసియా సంక్షోభం తీవ్రమవడంతో, ప్రపంచంలోని 20 శాతం ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా సరఫరాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో అంతర్జాతీయంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ఇటీవలి గణాంకాల ప్రకారం, జనవరి 2026లో రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు 19.3 శాతానికి తగ్గాయి. అయితే, ఫిబ్రవరి చివరి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మొదలైన తర్వాత భారత్ మళ్లీ రష్యా నుంచి కొనుగోళ్లను పెంచుతోంది. ఇంధనంతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, ఎరువులు, కనెక్టివిటీ వంటి ఇతర రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించడంపై ఈ సమావేశాల్లో చర్చించారు. గతేడాది భారత్‌కు ఎరువుల సరఫరా 40 శాతం పెంచామని, భవిష్యత్తులోనూ అన్ని విధాలా సహకరిస్తామని మంటురోవ్ తెలిపారు.

రష్యా తాజా ప్రతిపాదన భారత్ ఇంధన భద్రతకు భరోసా ఇవ్వడంతో పాటు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
Denis Manturov
Russia India relations
India Russia oil deal
Russian oil supply
India energy security
Crude oil supply
LNG supply India
Ajit Doval
S Jaishankar
Nirmala Sitharaman

More Telugu News