Harish Rao: లంబాడీల భూములు లాక్కొని జైల్లో పెట్టారు: హరీశ్ రావు

నారాయణపేట జిల్లా బావోజీ జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గిరిజనుల సంక్షేమం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని వివరిస్తూ, ప్రస్తుత పాలనలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ మండిపడ్డారు.


గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌దేనని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వపరిపాలన అందించారని కొనియాడారు. 

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్టీల కోసం బడ్జెట్‌లో రూ. 2,730 కోట్లు కేటాయించి, కేవలం రూ. 50 కోట్లు మాత్రమే ఖర్చు చేయడం గిరిజనులను వంచించడమేనని మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

లగచర్లలో లంబాడీల భూములను బలవంతంగా లాక్కుని వారిని జైల్లో పెట్టారని హరీశ్ ఆరోపించారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ప్యాకేజీ-3 పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సమస్యలను గాలికొదిలేసి ముఖ్యమంత్రి కేరళలో గొప్పలు చెప్పుకుంటున్నారని హరీశ్ ఎద్దేవా చేశారు.
Harish Rao
Revanth Reddy
Telangana Congress
BRS Party
Lambadi Lands
Narayana Pet
Telangana Politics
Palamuru Rangareddy Project
Tribal Reservations
Telangana Government

More Telugu News