Revanth Reddy: 2047 నాటికి తెలంగాణను టెక్స్‌టైల్ రాజధానిగా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

2047 నాటికి తెలంగాణను దక్షిణ ఆసియాకు టెక్స్‌టైల్ రాజధానిగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్ 2026లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో తయారైన వస్త్రాలను ప్రపంచంలోని ప్రతి దేశంలో ప్రజలు ధరించేలా చేయాలన్నదే తన ఆశయమని అన్నారు.

టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం భరోసా ఇచ్చారు. పెట్టుబడిదారులకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు, రాయితీలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, అనుమతులు కూడా వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. "మీకు విజన్ ఉంటే, మీకు సరైన భాగస్వాములం మేమే. కలిసికట్టుగా ప్రపంచాన్ని మార్చగల టెక్స్‌టైల్ వ్యవస్థను నిర్మిద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.

తెలంగాణ వస్త్రాలకు ఘనమైన చరిత్ర ఉందని, పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరల నుంచి వరంగల్ డర్రీల వరకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సీఎం గుర్తుచేశారు. దేశంలోనే అత్యధికంగా నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉందని తెలిపారు. వరంగల్‌లో ప్రపంచ స్థాయి కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అందుబాటులో ఉందని వివరించారు.

హైదరాబాద్ ఫిల్మ్ ప్రొడక్షన్‌కు హబ్‌గా మారుతోందని, నెట్‌ఫ్లిక్స్ వంటి సంస్థలు ఇక్కడ స్టూడియోలు ఏర్పాటు చేస్తున్నాయని సీఎం అన్నారు. బాలీవుడ్‌తో పాటు ఇప్పుడు హాలీవుడ్ కూడా హైదరాబాద్ వైపు చూస్తోందని, సినిమా పరిశ్రమ ఫ్యాషన్ అవసరాలను స్థానికంగానే తీర్చేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో గ్రీన్ టెక్స్‌టైల్ హబ్‌లను అభివృద్ధి చేస్తామని, యువతకు, ముఖ్యంగా మహిళలకు నైపుణ్య శిక్షణ ఇస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
Revanth Reddy
Telangana textiles
Textile industry
Asian Textile Conference
Kakatiya Mega Textile Park
Pochampally Ikat
Gadwal sarees
Warangal durries
Green textile hub
Hyderabad film production

More Telugu News