Ishika Yadav: ఐదేళ్ల ప్రేమ.. 50 రోజులకే అంతం.. కట్నం వేధింపులతో టెక్కీ ఆత్మహత్య!

ఐదేళ్ల పాటు ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న జంట కథ విషాదాంతంగా ముగిసింది. వివాహమైన 50 రోజులకే యువతి బలవన్మరణానికి పాల్పడింది. అదనపు కట్నం కోసం భర్త వేధిస్తుండటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన ఇషిక యాదవ్ (26), మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సాల్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఫేస్‌బుక్ ద్వారా వీరి పరిచయం మొదలైంది. ఇద్దరూ హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 10న పాట్నాలో వివాహం చేసుకున్నారు. అనంతరం మియాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం పెట్టారు.

పెళ్లయిన కొన్ని రోజుల నుంచే నీరజ్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. అదనపు కట్నం కింద బంగారం, వజ్రాభరణాలు, నగదు తీసుకురావాలంటూ ఇషికను మానసికంగా వేధించడం ప్రారంభించాడు. ఈ వేధింపులు భరించలేక బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. బంధువులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమ కుమార్తె మృతికి ఆమె భర్త నీరజ్ వేధింపులే కారణమని ఇషిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Ishika Yadav
Dowry harassment
Suicide
Hyderabad
Miyapur
Software engineer
Neeraj Bansal
Andhra Pradesh
Crime news
Techie suicide

More Telugu News