Markapuram bus accident: మార్కాపురం బస్సు ప్రమాదం... తక్కువ జీతానికి వస్తాడని లైసెన్స్ లేని డ్రైవర్ నియామకం

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లాలో 14 మందిని బలిగొన్న ప్రైవేట్ బస్సు ప్రమాద ఘటనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ప్రమాద సమయంలో బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేదని పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి బస్సు యజమాని హరికృష్ణారెడ్డి, డ్రైవర్ యువరాజ్‌ను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు.

మార్కాపురంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా డీఎస్పీ నాగరాజు వివరాలు తెలిపారు. లైసెన్స్ ఉన్న డ్రైవర్‌కు ఎక్కువ జీతం ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో యజమాని, లైసెన్స్ లేని యువరాజ్‌ను పనిలో పెట్టుకున్నట్లు ఆయన వివరించారు.

హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సు మార్చి 26న తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కనిగిరికి వెళ్తుండగా రాయవరం సమీపంలో టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మంటలు చెలరేగి 14 మంది ప్రయాణికులు సజీవ దహనం కాగా, మరో 29 మంది గాయపడ్డారు.

విచారణలో మరిన్ని విషయాలు బయటపడ్డాయి. యజమాని హరికృష్ణారెడ్డి ఎనిమిది నెలల క్రితం ఈ సెకండ్ హ్యాండ్ బస్సును కొనుగోలు చేశారు. వాహనం కండిషన్ సరిగా లేదని తెలిసినా అలాగే నడిపించారని పోలీసులు తెలిపారు. తరచూ రిపేర్లు వస్తుండటంతో, అసలు మార్గమైన వినుకొండ వైపు కాకుండా జాతీయ రహదారి మీదుగా బస్సును మళ్లించినట్లు కూడా దర్యాప్తులో తేలింది.

అధిక వేగంతో ప్రయాణిస్తున్న బస్సును, తప్పుగా కుడివైపునకు మళ్లించి ఎదురుగా వస్తున్న టిప్పర్ డీజిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు వ్యాపించాయని అధికారులు నిర్ధారించారు. బస్సులో సులభంగా అంటుకునే పదార్థాలు ఉండటం కూడా అగ్ని వేగంగా విస్తరించడానికి దోహదపడింది. అయితే, బస్సులోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ సుమారు 20 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడటానికి సహాయపడిందని అధికారులు తెలిపారు.
Markapuram bus accident
Harikrishna Reddy
bus accident
Andhra Pradesh
driver license
road accident
negligence
private bus
Rayavaram
Jagtial

More Telugu News