Nara Lokesh: ఇది లక్షద్వీప్ కాదు... వైజాగ్!: ఆసక్తికర వీడియో పంచుకున్న మంత్రి నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన ప్రచార వీడియోను ఆయన పంచుకున్నారు. రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త ఊపు తెచ్చే ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఈ ప్రచార వీడియోలో ఏపీలోని పలు సుందర ప్రదేశాలను దేశంలోని ఇతర ప్రముఖ పర్యాటక కేంద్రాలతో పోల్చి చూపించారు. "ఇది లక్షద్వీప్ కాదు వైజాగ్... సిక్కిం కాదు కైలాసగిరి... సుందర్ బన్స్ కాదు కోరింగ... తమిళనాడు కాదు సింహాచలం... గోవాలోని బాగా బీచ్ కాదు రుషికొండ బీచ్... ఇది కేరళ కాదు కోనసీమ... ఇది ఆంధ్రప్రదేశ్" అంటూ సాగే ఈ వీడియో రాష్ట్రంలోని ప్రకృతి రమణీయతను కళ్లకు కడుతోంది.

ఈ వీడియోతో పాటు లోకేశ్ ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు. "పవిత్ర ఆలయాల్లోని మంత్రోచ్ఛారణల నుంచి అంతులేని సముద్ర తీరం వరకు, కాలుష్యానికి దూరంగా ఉన్న కొండల అందాల వరకు ఆంధ్రప్రదేశ్ ఆత్మకు ఓ గొప్ప ప్రయాణం లాంటిది. ఇక్కడ ప్రకృతి, ఆధ్యాత్మికత, అవకాశాలు అన్నీ ఒకేచోట సంగమిస్తాయి. రండి, ఆంధ్రప్రదేశ్ మ్యాజిక్‌ను అనుభూతి చెందండి" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. 

Nara Lokesh
Andhra Pradesh Tourism
Vizag
Rushikonda Beach
Kailasagiri
Konaseema
Simhachalam
Tourism Promotion

More Telugu News