Jagan Mohan Reddy: ఆ విషయంలో జగన్ క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించలేరు: కొల్లు రవీంద్ర

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ ది క్రిమినల్, దోపిడీ, విధ్వంసం, అవినీతి క్రెడిట్ అని, దానిని ఎవరూ చోరీ చేయలేరని ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్ అని, దాని దరిదాపుల్లోకి కూడా జగన్ రాలేరని అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల క్రెడిట్‌ను జగన్ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మంగళవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బాబాయి హత్య, మద్యం స్కామ్ క్రెడిట్ ఆయనదే
తన బాబాయిని హత్య చేసి పిన్నమ్మ మెడలో తాళి తెంచిన హంతకులకు జగన్ అండగా నిలుస్తున్నారని కొల్లు రవీంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. బాబాయి హత్య కేసులో జగన్ ఆడించిన డ్రామాల క్రెడిట్‌ను ఎవరూ కోరుకోరని, ఆ క్రెడిట్ కేవలం ఆయనకే దక్కుతుందన్నారు. 

"రూ.3,500 కోట్ల అతిపెద్ద నకిలీ మద్యం స్కామ్ జగన్ హయాంలోనే జరిగింది. ప్రజల ప్రాణాలు పోయాయి. మహిళల మాంగల్యాలు మంటగలిశాయి. ల్యాండ్, స్యాండ్, మైన్, వైన్, గంజాయి ద్వారా కోట్లు దండుకున్నారు. యువతకు ఉద్యోగాలు లేకుండా చేసి గంజాయికి బానిసలను చేశారు. 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందుకే ప్రజలు 11 సీట్లే ఎక్కువని తేల్చి చెప్పారు. ఆ క్రెడిట్ కూడా జగన్‌దే" అని ఎద్దేవా చేశారు.

క్రెడిట్ కొట్టేసే పనిలో జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తోందని కొల్లు రవీంద్ర అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసంతోనే ఆర్సెలార్ మిట్టల్ సంస్థ రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో రాష్ట్రానికి వచ్చిందని, అయితే ఆ కంపెనీతో తానే మాట్లాడానంటూ జగన్ రెడ్డి సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని విమర్శించారు. 

"నిజంగా 2021లో జగన్ ఆ సంస్థతో ఒప్పందం చేసుకుని ఉంటే, 2024 వరకు ఎందుకు పనులు ప్రారంభించలేకపోయారు? కనీసం కడప స్టీల్ ప్లాంట్‌ను కూడా పూర్తి చేయలేని క్రెడిట్ జగన్‌ది. ఆయన తరిమేసిన గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలను కూడా మేం తిరిగి తెస్తున్నాం. చంద్రబాబు బ్రాండ్ వల్లే ఇదంతా సాధ్యమవుతోంది" అని ఆయన వివరించారు.

క్రిమినల్ క్రెడిట్ జగన్‌ది.. అభివృద్ధి చంద్రబాబుది
చెప్పిన అబద్ధాన్నే వందసార్లు చెప్పి మభ్యపెట్టడం జగన్ నైజమని మంత్రి కొల్లు విమర్శించారు. ప్రజల సమస్యలు చెప్పుకునే ప్రజావేదికను కూల్చారని, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును, నదుల అనుసంధానాన్ని అటకెక్కించారన్నారు. ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని నిర్మిస్తుంటే మూడు రాజధానులంటూ మూడు ముక్కలాట ఆడారని దుయ్యబట్టారు. 

"వెలిగొండ ప్రాజెక్టును నేనే పూర్తి చేశానని జగన్ అబద్ధాలు చెబుతున్నారు. రూ.5,000 కోట్ల ప్రాజెక్టుకు ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు కేటాయించారు. నేడు మేం రూ.4,500 కోట్లతో పనులను వేగవంతం చేస్తుంటే, ఆ క్రెడిట్‌ను కూడా దొంగిలించాలని చూస్తున్నారు" అని మండిపడ్డారు.

అమరావతిపై వైసీపీకి ఎందుకంత అక్కసు?
గతంలో అమరావతి ఒక శ్మశానం, బూత్ బంగ్లా అంటూ విషం చిమ్మిన వైసీపీ నేతలు, నేడు అమరావతి వెలుగులీనుతుంటే ఓర్వలేకపోతున్నారని మంత్రి అన్నారు. ప్రజా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, దీనిపై చర్చకు రాకుండా జగన్ బయట తన అనుచరులతో అవాకులు చవాకులు మాట్లాడిస్తున్నారని విమర్శించారు. 

"రాష్ట్రానికి రాజధాని ఉండటం వైసీపీకి ఇష్టం లేదు. మేం అమరావతిని రాజధానిగా ఉంచుతూనే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమకు కియా, రెన్యూ, డైకిన్ వంటి పరిశ్రమలు, ఉత్తరాంధ్రకు ఆర్సెలార్ మిట్టల్, భోగాపురం ఎయిర్‌పోర్ట్, మూలపేట పోర్టు వంటివి తెచ్చాం. పులివెందులకు కూడా నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుది. ఇదే నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ" అని స్పష్టం చేశారు.
Jagan Mohan Reddy
YS Jagan
Kollu Ravindra
Andhra Pradesh Politics
Chandrababu Naidu
TDP
YSRCP
Amaravati
Polavaram Project
Liquor Scam

More Telugu News