Balakrishna: అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణంపై బాలకృష్ణ కీలక ప్రకటన

పేద ప్రజలకు క్యాన్సర్ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడమే తమ ఆశయమని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో అడ్వాన్స్‌డ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రంతో పాటు కొత్త అంబులెన్స్‌ను ఆయన ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తమ సీఎస్‌ఆర్ (CSR) నిధుల కింద విరాళంగా ఇచ్చిన ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం విశిష్టతను బాలకృష్ణ వివరించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేస్తుందని తెలిపారు. అతి తక్కువ సమయంలోనే స్కానింగ్ పూర్తి చేసి, అత్యంత కచ్చితమైన ఫలితాలను అందిస్తుందని వెల్లడించారు. దీనివల్ల రోగులకు త్వరితగతిన చికిత్స అందించే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


మరోవైపు, అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే. దీని గురించి బాలకృష్ణ మాట్లాడుతూ... అమరావతి పరిధిలోని తుళ్లూరులో మరో వారం రోజుల్లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఈ ఆసుపత్రి వల్ల ఏపీలోని క్యాన్సర్ బాధితులకు స్థానికంగానే మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. 

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు, దాతల సహకారం వల్లే బసవతారకం ఆస్పత్రి నేడు ఈ స్థాయికి చేరుకుందని బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. దాతలు ఇచ్చే ప్రతి రూపాయిని పేదల వైద్యం కోసమే వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు.
Balakrishna
Basavatarakam Cancer Hospital
Amaravati
Cancer treatment
Andhra Pradesh
Tulluru
CSR funds
Bharat Dynamics Limited
Advanced Ultrasound Scanning
Artificial Intelligence

More Telugu News