Cyber Fraud: ఫేక్ కోర్టు, ఫేక్ పోలీసులు.. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో రిటైర్డ్ అధికారికి 1.57 కోట్ల టోకరా

ముంబైలో అత్యంత దారుణమైన సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. 'డిజిటల్ అరెస్ట్' పేరుతో 69 ఏళ్ల రిటైర్డ్ అధికారిని 25 రోజుల పాటు మానసికంగా నిర్బంధించి, ఆయన నుంచి రూ.1.57 కోట్లు కాజేశారు. నకిలీ పోలీసులు, నకిలీ కోర్టు అధికారుల అవతారమెత్తిన సైబర్ నేరగాళ్లు, బాధితుడిని భయపెట్టేందుకు వీడియో కాల్‌లో మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరును కూడా వాడుకోవడం గమనార్హం.

ముంబై పోలీసుల కథనం ప్రకారం... అంధేరిలోని డీఎన్ నగర్ ప్రాంతానికి చెందిన బాధితుడికి 2025 డిసెంబర్ 6న సంజయ్ కుమార్ గుప్తా అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికారినని, బాధితుడి మొబైల్ నంబర్ నుంచి అభ్యంతరకరమైన ఎంఎంఎస్‌లు వెళ్తున్నాయని, దీనిపై బాంద్రా క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైందని నమ్మించాడు.

ఆ తర్వాత కాల్‌ను ప్రదీప్ సావంత్ అనే మరో నకిలీ పోలీస్ అధికారికి బదిలీ చేశారు. బాధితుడిపై మనీలాండరింగ్ కేసు కూడా ఉందని, వ్యాపారవేత్త నరేష్ గోయల్‌తో సంబంధాలున్నాయని బెదిరించారు. తమ మోసాన్ని నిజమని నమ్మించేందుకు, వీడియో కాల్‌లో ఏకంగా నకిలీ కోర్టు విచారణను సృష్టించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఎస్.గవాయ్ పర్యవేక్షణలో విచారణ జరుగుతున్నట్లు నమ్మించి, సహకరించకపోతే తక్షణమే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు.

ఈ మానసిక ఒత్తిడితో భయపడిపోయిన బాధితుడు, దర్యాప్తులో భాగంగా "వెరిఫికేషన్" కోసం తన వద్ద ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్ సహా మొత్తం సొమ్మును వారు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయాలని సూచించారు. అరెస్ట్ భయంతో, 2025 డిసెంబర్ 8 నుంచి 2026 జనవరి 3 మధ్య విడతలవారీగా రూ.1.57 కోట్లు బదిలీ చేశాడు.

డబ్బు బదిలీలు పూర్తయ్యాక నేరగాళ్ల నుంచి కాల్స్ రావడం ఆగిపోవడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యులతో చర్చించి, సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మనీ ట్రయల్‌ను ట్రేస్ చేయగా, ఆటో-రిక్షా డ్రైవర్ అయిన అశోక్ పాల్ ఖాతాలోకి నిధులు వెళ్లినట్లు గుర్తించారు. కమీషన్ తీసుకుని తన ఖాతాను సైబర్ నేరగాళ్లకు వాడుకోవడానికి అనుమతించినట్లు విచారణలో పాల్ అంగీకరించాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, ప్రజలు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. "డిజిటల్ అరెస్ట్" లేదా "ఆన్‌లైన్ కోర్టు విచారణ" వంటి పదాలు పూర్తిగా మోసపూరితమైనవని స్పష్టం చేశారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా డబ్బు బదిలీ చేయమని అడగదని గుర్తుచేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే భయపడకుండా, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
Cyber Fraud
Digital Arrest
Mumbai Cyber Crime
Online Scam
Fake Police
Retired Officer Scam
Justice Gavai
Money Laundering Case
Cyber Cell Police
Ashok Paul

More Telugu News