KTR: కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల 'పొలిటికల్ బ్రేక్ఫాస్ట్'
తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నార్సింగి సర్కిల్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న జయభేరి టెంపుల్ ట్రీ విల్లాలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ కీలక నేతలు వెళ్లారు. కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ 'బ్రేక్ఫాస్ట్ మీటింగ్' ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి తదితరులు కేటీఆర్ నివాసానికి వెళ్లారు.
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వస్తున్న ఆరోపణలు, సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎలా తిప్పికొట్టాలనే అంశంపై నేతలు ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో పార్టీ శ్రేణులను ఎలా సమన్వయం చేయాలనే దానిపై కేటీఆర్ దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.