Ponguleti Srinivas Reddy: మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలి... గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై వచ్చిన అవినీతి, అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో, ఆయనను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం నాడు అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. అనంతరం ఈ అంశాన్ని శాసనసభలో కూడా ప్రస్తావించారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శాసనసభ ఉప నాయకుడు హరీశ్ రావు ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఈ నిరసనలో పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ, దీనిపై సభా సంఘం లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేఖ రాశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఆధారాలతోనే హరీశ్ రావు ఈ కుంభకోణాన్ని బయటపెట్టారని అన్నారు. ఇతర కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, మంత్రి కుటుంబ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ కంపెనీతో మంత్రి భార్య, కుమారుడు, సోదరుడికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని, 2020-22 మధ్య పొంగులేటి ఛైర్మన్‌గా ఉన్నారని కేటీఆర్ గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి పొంగులేటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో సీఎంకు కూడా ప్రమేయం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో గవర్నర్‌కు ఫిర్యాదు చేసి, ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామని హెచ్చరించారు.
Ponguleti Srinivas Reddy
BRS protest
Telangana government
KTR
Harish Rao
Revanth Reddy
Corruption allegations
Illegal mining
Ragava Constructions
Telangana Assembly

More Telugu News