Shankar Yadav: మాటా మాటా పెరిగి... ఐస్ క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి!

ఉత్తరప్రదేశ్‌లో అత్యంత పాశవికమైన, ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. బారాబంకి జిల్లాలో ఓ వ్యక్తి, ఐస్‌క్రీమ్ అమ్ముకునే యువకుడితో గొడవపడి, కొడవలితో అతని తల నరికాడు. అంతటితో ఆగకుండా, ఆ తలను తన ఇంటికి తీసుకెళ్లి, అసలేమీ జరగనట్టుగా దాని పక్కనే వంట చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పర్సావల్ గ్రామంలో శనివారం ఈ దారుణం జరిగింది. బబ్లు (25) అనే యువకుడు రోజూలాగే సైకిల్‌పై ఐస్‌క్రీమ్ అమ్ముకునేందుకు గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో, అదే గ్రామానికి చెందిన శంకర్ యాదవ్ (50) అనే వ్యక్తితో అతనికి మాటామాటా పెరిగింది. ఈ వాగ్వాదం ముదరడంతో శంకర్ యాదవ్ తన వద్ద ఉన్న కొడవలితో బబ్లుపై దాడి చేసి, మెడను కోసి తలను మొండెం నుంచి వేరు చేశాడు. చుట్టూ జనం చూస్తుండగానే, నరికిన తలను చేత్తో పట్టుకుని శంకర్ యాదవ్ తన ఇంటికి తీసుకెళ్లాడు.

సమాచారం అందుకున్న బరబంకి ఎస్పీ అర్పిత విజయవర్గీయ నేతృత్వంలో భారీ పోలీస్ బృందం గ్రామానికి చేరుకుంది. నిందితుడి ఇంటిని చుట్టుముట్టి లోపలికి ప్రవేశించగా, అక్కడ కనిపించిన దృశ్యం వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. శంకర్ యాదవ్ నరికిన తలను పక్కనే పెట్టుకుని, అసలేమీ జరగనట్టుగా వంట చేసుకుంటున్నాడు. పోలీసులు వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు.

మృతుడు బబ్లు తన కుటుంబానికి పెద్ద దిక్కు. ముగ్గురు సోదరులలో అతనే పెద్దవాడు. ఐస్‌క్రీమ్ అమ్మడం, ఇతర కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య, చిన్న పిల్లలు ఉన్నారు. బబ్లు మరణ వార్త తెలియగానే ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. బబ్లు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు వీరిద్దరి మధ్య వాగ్వాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక స్థితిపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

Shankar Yadav
Barabanki
Uttar Pradesh crime
ice cream vendor murder
beheading
crime news
India crime
police investigation
Parsawal village

More Telugu News