Revanth Reddy: హరీశ్ రావు సోదరుడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు సోదరుడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్ రావు తమ్ముడు మహేశ్వర్ రావు ఇసుక మాఫియా నడిపారని శాసనసభలో ఆరోపించారు. అతడి అక్రమాల వల్లే కేటీఆర్ మైనింగ్ శాఖను తీసుకున్నారని అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మైనింగ్, ఇసుక తవ్వకాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.

సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి అన్నారు. మాజీ ఎంపీ సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావులపై విచారణ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ నాయకుడు గంగుల కమలాకర్ అక్రమ గ్రానైట్ మైనింగ్, వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్‌పై విచారణకు సిద్ధమని తెలిపారు. రాఘవ కన్‌స్ట్రక్షన్‌తో పాటు అన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.

విచారణలో నిజానిజాలు నిగ్గుతేల్చి శాసనసభలో నివేదికను పెడతామని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. వద్దిరాజు రవిచంద్ర వంటి వారిని బీఆర్ఎస్ నాయకులు బెదిరించి తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు.
Revanth Reddy
Harish Rao
Telangana
Telangana Assembly
Maheshwar Rao
Sand Mafia
Mining Scam

More Telugu News