Ram Koti: 22 ఏళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంటకు ప్రతి ఏటా పెళ్లి!

ప్రేమించిన వారిని ఒకటి చేయలేకపోయామన్న ఆవేదన వారిని వెంటాడుతూనే ఉంది. 22 ఏళ్ల క్రితం తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదని బలవన్మరణానికి పాల్పడిన ఓ ప్రేమజంట విగ్రహాలకు వారి కుటుంబ సభ్యులు ప్రతి ఏటా పెళ్లి చేస్తున్నారు. 

వివరాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్ పోడు తండాకు చెందిన రామ్ కోటి అనే యువకుడు 22 ఏళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించాడు. అయితే వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ జంట ఆత్మహత్య చేసుకుంది. కొడుకు మరణాన్ని తట్టుకోలేని రామ్ కోటి తల్లిదండ్రులు, ఇంటి ఆవరణలోనే ఓ గుడి కట్టించారు. ఆ గుడిలో కొడుకు రామ్ కోటితో పాటు అతని ప్రియురాలి విగ్రహాలను కూడా ప్రతిష్టించారు.

అంతటితో ఆగకుండా, చనిపోయిన తమ కొడుకు కోరికను తీర్చాలనే తపనతో ప్రతీ ఏటా శ్రీరామ నవమి పర్వదినాన వారి విగ్రహాలకు శాస్త్రోక్తంగా వివాహం జరిపిస్తున్నారు. తమ చేతుల మీదుగా ఒకటి కాలేకపోయిన జంటను, కనీసం ఈ రూపంలోనైనా కలిపి వారు సంతృప్తి చెందుతున్నారు.
ఈ ఏడాది కూడా శ్రీరామ నవమి సందర్భంగా వారి విగ్రహాలకు పెళ్లి జరిపించగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన పలువురు నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. 
Ram Koti
Mahabubabad
Bayyaram
Love couple suicide
Intercaste marriage
Sri Rama Navami
Statue wedding
Sentulal Podu Thanda
Telangana
Love story

More Telugu News