Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత కొత్త పార్టీపై బండి సంజయ్ స్పందన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత పార్టీపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంటుందని... అది వారి వ్యక్తిగత, రాజకీయ స్వేచ్ఛకు సంబంధించిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాజకీయాల్లో రాబోయే కొత్త సమీకరణాలకు ఇది సంకేతమని అన్నారు. కొత్త పార్టీ పెట్టాలనే కవిత ఆలోచనను తాము స్వాగతిస్తున్నామని తెలిపారు.


ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఆయన విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి కేసీఆరే ప్రధాన కారణమని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. "కాళేశ్వరానికి కేసీఆర్ అతిపెద్ద ఇంజనీర్. టోపీ పెట్టుకుని మరీ ఆయనే దీనిని డిజైన్ చేశారు" అంటూ ఎద్దేవా చేశారు. ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్లే ప్రాజెక్టు కుంగిపోయిందని, వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని మండిపడ్డారు. ఈ పాపమంతా గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.


రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉందని బండి సంజయ్ మండిపడ్డారు. ప్రధాని మోదీపై విమర్శలు చేసే క్రమంలో రేవంత్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై చర్యలు తీసుకోవడంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

Kalvakuntla Kavitha
Bandi Sanjay
Telangana Jagruthi
BRS Party
New Political Party Telangana
Kaleshwaram Project
Revanth Reddy
Telangana Politics
KCR
BJP Telangana

More Telugu News