Jaggareddy: మానవ అక్రమ రవాణా కేసు.. జగ్గారెడ్డిని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

Jaggareddy Acquitted in Human Trafficking Case by Court
షార్ట్స్‌లో చూడండి
దశాబ్ద కాలానికి పైగా సంచలనం సృష్టించిన మానవ అక్రమ రవాణా (హ్యూమన్ ట్రాఫికింగ్) కేసులో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి (జయప్రకాష్ రెడ్డి), ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్‌కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో వీరిద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.

ఈ కేసు మూలాలు 2004 నాటివి. అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి, తన అధికారిక లెటర్ హెడ్‌ను ఉపయోగించి ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారికి లేఖ రాశారని.. తన భార్య, కుమార్తె, కుమారుడి పేర్లతో నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ముగ్గురు వ్యక్తులను అమెరికాకు తరలించారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్లతో పాస్‌పోర్టులు పొంది, వారిని అమెరికా తీసుకెళ్లడం ద్వారా డబ్బు సంపాదించారనేది ప్రధాన ఆరోపణ.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో ఈ కేసు నమోదైంది. ఆ సమయంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్టు చేయగా, ఆయన సుమారు మూడు నెలల పాటు జ్యుడీషియల్ రిమాండులో వున్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిని A1గా, కుసుమ కుమార్‌ను A3గా చేర్చారు. జగ్గారెడ్డి 2018-23 వరకు సంగారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగడంతో, ఈ కేసు విచారణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు చేపట్టింది.

సుదీర్ఘ విచారణ అనంతరం, జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నేరానికి పాల్పడినట్లు సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. నేరాలు రుజువు కాకపోవడంతో వారిపై ఉన్న కేసును కొట్టివేస్తూ, ఇద్దరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాది జి.సంతోష్ రెడ్డి వాదనలు వినిపించారు.
Go Back to Shorts
Jaggareddy
Human Trafficking Case
Jaggareddy acquitted
Congress leader
Telangana News
Sangareddy MLA
Jetti Kusuma Kumar
Special Court Hyderabad
Passport fraud
Fake documents

More Telugu News