Stephen Ravindra: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ప్రచారంపై స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ
తెలంగాణలో గత కొన్ని రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న రద్దీ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో రాబోయే 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు కంగారు పడి బంకుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా వంట గ్యాస్ విషయంలో నిన్న ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 484 ట్రక్కుల సిలిండర్లను డెలివరీ చేయడం జరిగిందని తెలిపారు.
పైప్డ్ (పైపు ద్వారా సరఫరా చేసే) నేచురల్ గ్యాస్ (PNG), వాహనాలకు వాడే సీఎన్జీ (CNG) సరఫరాలో కూడా ఎలాంటి అంతరాయం లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. అవసరానికి మించి అడ్వాన్స్గా బుకింగ్స్ చేయడం వల్లే సిస్టమ్పై అనవసరమైన ఒత్తిడి పెరుగుతోందని, ప్రజలు సంయమనం పాటించాలని కోరారు.
ఇంధన నిల్వలను, సరఫరాను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసిందని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.