హర్యానాలో ఆరేళ్లలో గుండెపోటుతో 17,973 మరణాలు

రాష్ట్రంలో 2020 జనవరి నుంచి 2026 జనవరి మధ్య కాలంలో 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు గలవారు వేల సంఖ్యలో గుండెపోటుతో మరణించినట్లు అసెంబ్లీలో హర్యానా ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆరేళ్ల కాలంలో 17,973 మంది గుండెపోటు కారణంగా మరణించినట్లు అసెంబ్లీలో తెలిపింది.

యువతలో గుండెపోటు కారణంగా సంభవించిన మరణాలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. గత ఆరేళ్ల కాలంలో ఏ జిల్లాలో, ఎంతమంది, ఎంత వయస్సు కలిగిన వారు, హార్ట్ ఫెయిల్ కారణంగా మరణించారో తెలియజేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగారు. ఈ మరణాలకు కరోనా వైరస్, కొవిడ్ వ్యాక్సీన్‌తో సంబంధం ఉందా, ఆ దిశగా ఏమైనా చర్యలు చేపట్టారా? అని ప్రశ్నించారు.

అలాంటి సర్వేను నిర్వహించలేదని ప్రభుత్వం అసెంబ్లీలో తెలిపింది. జిల్లాల వారీగా, ఏ సంవత్సరంలో ఎంతమంది గుండెపోటుతో మరణించారో తెలిపింది. సంవత్సరాల వారీగా చూస్తే, 2020లో 2,394 మరణాలు సంభవించగా, 2021లో 3,188, 2022లో 2,796, 2023లో 2,886, 2024లో 3,063, 2025లో 3,255 మరణాలు జరిగినట్లు తెలిపింది. 2026 జనవరిలో 391 గుండెపోటు మరణాలు నమోదైనట్లు తెలిపింది.


More Telugu News