KTR: మూసీ ప్రాజెక్టు రూ.1.5 లక్షల కోట్ల స్కామ్‌: కేటీఆర్

Rama Rao alleges 1 lakh 50000 crore scam in name of Musi project
షార్ట్స్‌లో చూడండి
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. ఈ అంశంపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ వైఖరిలో పారదర్శకత లేదని నిరసిస్తూ కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మూసీ నది పునరుజ్జీవనానికి తమ పార్టీ వ్యతిరేకం కాదని, కానీ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న భారీ దోపిడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమైతే, దానిని ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండానే వేల ఇళ్ల కూల్చివేతకు, భూసేకరణకు ఎలా సిద్ధమవుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు.

కేటీఆర్ ఆరోపణలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ప్రాజెక్టుపై ఎలాంటి దాపరికం లేదని, కేటీఆర్ ఆరోపణలు నిరాధారమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రాజెక్టు మొదటి దశకు సంబంధించిన డీపీఆర్ పూర్తయిందని, దాని అంచనా వ్యయం రూ.6,500 కోట్ల నుంచి రూ.7,000 కోట్ల వరకు ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల 1,435 నిర్మాణాలు ప్రభావితం అవుతాయని, తుది గణన జరుగుతోందని తెలిపారు. బఫర్ జోన్‌లో ఉన్న వారికి బదిలీ చేయగల అభివృద్ధి హక్కులు (టీడీఆర్) ఇస్తామని, భూసేకరణ, పునరావాసం 2013 చట్టం ప్రకారమే జరుగుతుందని హామీ ఇచ్చారు.

అయితే, ప్రభుత్వ వాదనను కేటీఆర్ తోసిపుచ్చారు. ముఖ్యమంత్రి బహిరంగ సభల్లో రూ.1.5 లక్షల కోట్ల ప్రాజెక్టు అంటుంటే, సభలో మంత్రులు కేవలం రూ.7,000 కోట్లు అని చెప్పడంలోనే వైరుధ్యం కనిపిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ గెజిట్ ప్రకారం 10,000 ఇళ్లు కూల్చివేస్తారని, 3,260 ఎకరాల భూమిని సేకరించనున్నారని పేర్కొన్నారు. సింగపూర్, పాకిస్థాన్ వంటి దేశాల్లో నిషేధానికి గురైన 'మెయిన్ హార్ట్' అనే కంపెనీకి డీపీఆర్ బాధ్యతలు ఎలా అప్పగించారని ఆయన ప్రశ్నించారు. 18 నెలలు పట్టే డీపీఆర్‌ను రెండు నెలల్లోనే ఎలా పూర్తి చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద నిధులు లేవని, స్పష్టమైన ప్రణాళిక కూడా లేదని, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి ఎలాంటి రుణం మంజూరు కాలేదని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని ఆయన, పారదర్శకత పాటించడం లేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Go Back to Shorts
KTR
K Taraka Rama Rao
Moosi Riverfront Development Project
Telangana
BRS
Revanth Reddy
Corruption
DPR
Sridhar Babu
Mallu Bhatti Vikramarka

More Telugu News