500 కోట్ల భోజనాలు: అక్షయపాత్రకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. సంస్థ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో పాటు, 500 కోట్ల భోజనాలు అందించిన అద్భుతమైన మైలురాయిని చేరుకోవడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. మానవసేవ ద్వారా, ముఖ్యంగా నిరుపేదలకు అండగా నిలవడం ద్వారా ఉత్తమ ప్రపంచాన్ని నిర్మించగలమని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి సమక్షంలో రాష్ట్రపతి భవన్‌లో ఈ మైలురాయిని చేరుకోవడం అభినందనీయం. అక్షయపాత్ర సమాజానికి, ముఖ్యంగా పిల్లలకు అందిస్తున్న సేవలు ఎనలేనివి" అని పేర్కొన్నారు. పీఎం పోషణ్ వంటి కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అన్నా క్యాంటీన్ల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు భోజనం అందించడంలో అక్షయపాత్ర కీలక భాగస్వామిగా ఉందని ఆయన గుర్తుచేశారు.

దేశ భవిష్యత్తుకు పోషణ అందిస్తున్న ఈ సంస్థ సేవలు "సుపోషిత్, సుశిక్షిత్, వికసిత్ భారత్" నిర్మాణానికి దోహదపడుతున్నాయని చంద్రబాబు కొనియాడారు. భవిష్యత్తులోనూ అక్షయపాత్ర మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.


More Telugu News