ఎల్నినో ప్రభావం.. పంటల మార్పిడిపై సీఎం చంద్రబాబు దృష్టి
- పంటల మార్పిడి అవకాశాలను పరిశీలించాలని సూచన
- ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలని ఆదేశం
- పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై సమావేశాలకు నిర్దేశం
- కష్టకాలంలో రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతులను పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లించేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల సర్టిఫికేషన్కు ప్రాధాన్యత పెరుగుతున్న దృష్ట్యా, ఈ అంశాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. ఇలాంటి చైతన్య కార్యక్రమాల్లో తాను కూడా స్వయంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతులు శాస్త్రీయ విధానాల్లో సాగు చేపట్టేలా ప్రోత్సహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మిర్చి, పొగాకు, తోతాపురి మామిడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పొగాకు కొనుగోలుదారులతో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెట్లో గిట్టుబాటు ధర లభించే వరకు పంటను నిల్వ చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. అధిక డిమాండ్ ఉన్న పప్పు దినుసుల సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా చూడాలన్నారు. వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు విలువ జోడింపు అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా నొక్కిచెప్పారు.
విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారుల సమస్యల పరిష్కారానికి వారితోనూ సమావేశం కావాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.