అసెంబ్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్లిన రాజాసింగ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలోని బీజేఎల్పీ కార్యాలయానికి వెళ్లడం ఆసక్తిని రేకెత్తించింది. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ (బీజేఎల్పీ) కార్యాలయానికి ఆయన వెళ్లడం, అక్కడి ఎమ్మెల్యేలతో గంటకు పైగా ముచ్చటించడం చర్చనీయాంశంగా మారింది.


ఈ అంశంపై రాజాసింగ్ తనదైన శైలిలో స్పందిస్తూ... "ఇది నా పాత ఇల్లు. వీరంతా నా పాత స్నేహితులు. ఎప్పుడైనా వస్తాను, ఎప్పుడైనా వెళతాను" అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఏ పార్టీలో చేరాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. తనను బీజేపీలో చేర్చుకోమని తాను బతిమిలాడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. భవిష్యత్తులో ఎవరు ఎవరిని బతిమిలాడుతారో తేలుతుందని అన్నారు. ప్రస్తుతం తాను స్వేచ్ఛగా తిరుగుతూ మోదీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నానని పేర్కొన్నారు.


మరోవైపు, బీజేఎల్పీ కార్యాలయం వద్ద రాజాసింగ్ ఉన్న సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడకు రావడం ఇంకో ఆసక్తికర సన్నివేశానికి దారితీసింది. రాజాసింగ్‌ను చూడగానే కేటీఆర్ నవ్వుతూ... "సస్పెండ్ అయిన వ్యక్తివి బీజేఎల్పీ లోపలికి ఎలా వెళతావు? బయటకు రా" అని సరదాగా ఆటపట్టించారు. దీనికి స్పందనగా అక్కడే ఉన్న బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్.. "మీరు కూడా బీజేపీ ఛాంబర్‌లోకి రావాలి" అని కేటీఆర్‌ను ఆహ్వానించడం అసెంబ్లీ లాబీల్లో నవ్వులు పూయించింది.



More Telugu News