ఎమ్మెల్యేలు, ఎంపీలు డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలి: అనిరుధ్ రెడ్డి
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్హౌస్పై జరిగిన దాడి, అందులో ఆయనతో పాటు ఏపీకి చెందిన ఓ ఎంపీకి కూడా డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్గా తేలడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నేడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
డ్రగ్స్ అనే మహమ్మారి మూలాలు ఎక్కువగా సినిమా పరిశ్రమలోనే కనిపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. అందుకే సినిమాల విడుదలకు ముందే నటీనటులందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించాలని, అందులో క్లీన్గా ఉంటేనే వారి సినిమాలను థియేటర్లలోకి అనుమతించాలని సంచలన ప్రతిపాదన చేశారు. కేవలం సినీ రంగమే కాదు, ప్రజాప్రతినిధులు కూడా సమాజానికి ఆదర్శంగా ఉండాలని... ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తప్పనిసరిగా డ్రగ్స్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవడానికి నిరాకరించే ఏ ప్రజాప్రతినిధినైనా సరే అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వకూడదని అన్నారు.