స్టాలిన్ పాలనలో మహిళలకు భద్రత లేదు: నటి గౌతమి
- మహిళలను డీఎంకే కేవలం ఓటు బ్యాంకుగా పరిగణిస్తోందని గౌతమి విమర్శ
- మాదకద్రవ్యాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణ
- విలాతికులం ఘటనపై కనిమొళి స్పందనను తప్పుబట్టిన నటి
- ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన
జయలలిత హయాంలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారని గౌతమి గుర్తుచేశారు. ఆమె తన చివరి శ్వాస వరకు మహిళల సాధికారతకు కట్టుబడి ఉన్నారని, వారి కోసం ఎన్నో పథకాలు అమలు చేశారని తెలిపారు. కానీ, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వం మాత్రం మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని విమర్శించారు. మహిళలకు భద్రత, గౌరవం కల్పించడంలో స్టాలిన్ సర్కార్ విఫలమైందని ఆమె దుయ్యబట్టారు.
విలాతికులం అత్యాచారం, హత్య ఘటనపై డీఎంకే ఎంపీ కనిమొళి స్పందించిన తీరును కూడా గౌతమి తప్పుబట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాకే మాట్లాడతానని చెప్పడం బాధితురాలి కుటుంబం పట్ల సున్నితత్వం లేకుండా వ్యవహరించడమేనని అన్నారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది భవిష్యత్ తరాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి మహిళల హక్కుల కోసం సుమారు 28 నెలలుగా పోరాడుతున్నారని ప్రశంసించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే మధ్యే ఉంటుందని, ఇతర పార్టీల ప్రభావం నామమాత్రమేనని గౌతమి జోస్యం చెప్పారు.